
తొలి పూజల దేవుడు
ఒక రాక్షసుడి కోరిక, నలుగు పిండితో పుట్టిన బాలుడు, నవ్విన చంద్రుడు, శ్రీకృష్ణుడి దాకా వెళ్ళిన ఒక శాపం. వినాయకుడి పూర్తి కథ, పన్నెండు భాగాల్లో.
శివుడు తన కడుపులోనే ఉండిపోవాలని గజాసురుడు తపస్సు చేసి వరం పొందుతాడు. ఆయనను తిరిగి తీసుకురావడానికి విష్ణుమూర్తి గంగిరెద్దులవాడిగా, నంది గంగిరెద్దుగా వెళ్తారు. కైలాసంలో పార్వతీదేవి నలుగు పిండితో ఒక బాలుడిని చేసి వాకిట్లో కాపలా పెడుతుంది. ఆ బాలుడెవరో తెలియని శివుడు అతని తల నరికేస్తాడు. గజాసురుడికి ఇచ్చిన మాట ప్రకారం ఏనుగు తలతో మళ్ళీ బతికిన ఆ బాలుడే వినాయకుడు. మూషికాసురుడిని ఎలుక వాహనంగా మార్చుకుంటాడు, తల్లిదండ్రుల చుట్టూ తిరిగి గణాధిపత్యం గెలుస్తాడు, పుట్టినరోజున కడుపు నిండా తిని చంద్రుడి నవ్వుకు గురవుతాడు. పార్వతీదేవి శాపం సప్తర్షుల భార్యలపై నీలాపనిందలు తెస్తుంది, యుగాల తర్వాత శమంతకమణి విషయంలో శ్రీకృష్ణుడినే దొంగను చేస్తుంది. జాంబవంతుడి గుహ దాకా వెళ్ళి నిజం నిరూపించిన కృష్ణుడు లోకానికి వినాయక చవితి వ్రతాన్ని అందిస్తాడు.


